తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 14,087 కరోనా కేసులు, 109 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,53,116కు, మొత్తం మరణాల సంఖ్య 14,489కు పెరిగింది. కాగా, గత 24 గంటల్లో 11,867 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 29,22,921కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,15,226 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది.