తిరువనంతపురం: కేరళలో కరోనా వైరస్ ఇంకా ఉధృతంగానే ఉన్నది. ఇప్పటికీ రోజుకు 10 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇవాళ కూడా 13,383 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే రికవరీలు మాత్రం అంతకంటే ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 21,942 మంది కరోనా బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దాంతో ఆ రాష్ట్రంలో వైరస్ బారి నుంచి కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 36,53,008కి చేరింది.
ఇదిలావుంటే కరోనా మరణాలు కూడా ప్రతిరోజూ 100కు అటుఇటుగా నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 90 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 19,584కు చేరింది. మొత్తం కేసులలో కరోనా మరణాలు, రికవరీలు పోను ప్రస్తుతం 1,54,563 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇవాళ మొత్తం 85,650 మంది కరోనా పరీక్షలు చేయగా.. 15.63 శాతం పాజిటివిటీ రేటు నమోదయ్యింది.