Corornavirus | చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొవిడ్ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ వారం రోజుల్లోనే అక్కడ కొవిడ్-19 కేసులు 277 శాతం పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కేరళలో గత వారం 111 యాక్టివ్ కేసులు ఉండగా.. వాటి సంఖ్య ఒక్కసారిగా 1,634కు చేరింది. వీటిలో జేఎన్.1 అనే కొత్త వేరియంట్ బయటపడటం మరింత బెంబేలెత్తిస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
అమెరికాలో మొదలై..
జేఎన్.1 వేరియంట్ తొలి కేసు అమెరికాలో వెలుగుచూసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఇది బయటపడింది. ఒమిక్రాన్ రకంలోని పిరోలా వేరియంట్ (బీఏ.2.86) నుంచి ఇది రూపాంతరం చెందింది. బీఏ.2.86లోని స్పైక్ ప్రోటీన్తో పోలిస్తే ఈ వేరియంట్లో ఒక్క మ్యుటేషన్ అదనంగా కనిపించింది.. బీఏ.2.86 ప్రోటీన్లో 20 మ్యుటేషన్లు ఉండగా.. ఈ కొత్త వేరియంట్లో 21 మ్యుటేషన్లు ఉన్నాయి. అందువల్ల దీని లక్షణాలు కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి. అయితే ఒక మ్యుటేషన్ అదనంగా ఉండటం వల్ల ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చాలా వేగంగా ఉందని అమెరికాలోని నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిష్రేషన్ అధికారులు హెచ్చరించారు. అమెరికాలో 15 నుంచి 29 శాతం వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అమెరికాలో మొదలైన ఈ వేరియంట్ ఇప్పుడు 38 దేశాలకు వ్యాపించింది. చైనాలో డిసెంబర్ 15న 7 కేసులు గుర్తించారు. తాజాగా భారత్లోనూ ఈ కేసులు బయటపడ్డాయి.
భారత్లో ఇలా వెలుగులోకి..
భారత్లో తొలి కేసు కేరళలో బయటపడింది. తిరువనంతపురం కారకుళంలోని 79 ఏండ్ల వృద్ధురాలికి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించినప్పుడు జేఎన్.1 వేరియంట్ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇంతలోనే ఆ పేషెంట్ మరణించడంతో ఈ వేరియంట్పై రకరకాల ఆందోళనలు మొదలయ్యాయి. దీనిపై వైద్యులు వివరణ ఇచ్చారు. సదరు రోగికి జేఎన్.1 వేరియంట్ సోకింది.. కానీ ఆమె మరణానికి అదే కారణం కాదని వెల్లడించారు. అంతకుముందు నుంచి ఆమె కిడ్నీ, ఇతరత్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదని.. వాటి కారణంగానే ఆమె మరణించిందని ప్రకటించారు.
లక్షణాలు :
జ్వరం, జలుబు, ముక్కుకారడం, తలనొప్పి, ఒంటి నొప్పులు, నీరసం, కళ్లు ఎర్రబడటం, కడుపులో నొప్పి, కొందరిలో శ్వాస సమస్యలు.
ఈ కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించడానికి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతున్నది. గతంలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు కూడా ఈ వేరియంట్ సోకుతుందని గురుగ్రామ్ సీకే బిర్లా ఆస్పత్రి వైద్యుడు తుషార్ తయాల్ వెల్లడించారు. అయితే ఇది అంత ప్రమాదకరమైనది కాదని.. వ్యాక్సిన్లకు లొంగే రకమే అని స్పష్టం చేశారు. కాకపోతే చలికాలంపైగా, పండుగల సీజన్ కావడంతో ఈ వేరియంట్ నియంత్రణ కష్టతరం కావచ్చని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్-19 సోకిన వారికి ఇప్పుడు ఇస్తున్న ట్రీట్మెంటే.. ఇప్పుడు జేఎన్.1కి కూడా సమర్థంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. అయితే ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాప్తిని అరికట్టవచ్చని చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని.. మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.