తిరువనంతపురం: అదానీ పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా కేరళలో నిరసనలు కొనసాగుతున్నాయి. కొందరిని అరెస్ట్ చేయడంపై ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. దీంతో పలువురు పోలీసులు గాయపడగా, లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో సుమారు మూడు వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలో ఈ సంఘటన జరిగింది. విజింజం సముద్ర తీరంలో అదానీ గ్రూప్ చేపట్టిన పోర్టు నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. తీరం కోతకు గురవుతుందని, తాము జీవనోపాధిని కోల్పోతామని ఆ ప్రాంత మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. వందలాది మంది కాథలిక్ ఫాదర్ల నేతృత్వంలో కొన్ని నెలలుగా నిరసనలు కొనసాగుతున్నాయి. పోర్ట్ ఎంట్రన్స్ను బ్లాక్ చేసి సామగ్రి రవాణాను అడ్డుకున్నారు. దీంతో గత మూడు నెలలుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 15 మంది కేథలిక్ ఫాదర్స్తో సహా వంద మందిపై పలు కేసులు నమోదయ్యాయి.
కాగా, ఇటీవల ప్రాజెక్టుకు రాళ్లను తరలిస్తున్న 25 లారీలను నిరసనకారులు అడ్డుకుని వెనక్కి పంపారు. అలాగే నిర్మాణ ప్రాంతంలో ఉన్న మరో 25 లారీలు అక్కడి నుంచి వెళ్లనీయలేదు. ఈ నేపథ్యంలో పోర్టుకు మద్దతిచ్చే వర్గం శనివారం నిరసనకు దిగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ, రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పోలీసులతోపాటు పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు కొందరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ కేసులు, అరెస్ట్లకు నిరసనగా స్థానికులు ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విజింజం పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ దాడికి సంబంధించి మహిళలు, పిల్లలతో సహా సుమారు మూడు వేల మందిపై సోమవారం కేసు నమోదు చేశారు. అలాగే కస్టడీలో ఉన్న నలుగురిని స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన జిల్లా యంత్రాంగం చొరవ, సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.