Kerala Triple Blasts | కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ( Rajeev Chandrasekhar)పై కేరళ పోలీసు (Kerala Police) స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కేరళలో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో వివిధ మతాల మధ్య విద్వేషాన్ని పెంపొందించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనపై కేరళ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 153(ఏ), కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 120 కింద కేసులు బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కలమస్సేరి (Kalamassery)లోని ‘జెహోవా విట్నెసెస్’ అనే క్రైస్తవ మత గ్రూపు (Christian group Jehovah’s Witnesses ) ప్రజలు సమావేశమైన జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం వరుస బాంబు పేలుళ్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. కన్వెన్షన్ హాలులో ప్రార్థనలు ప్రారంభమైన తర్వాత నిమిషాల వ్యవధిలో మూడుసార్లు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 51 మంది గాయపడ్డారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన రాజీవ్ చంద్రశేఖర్.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan)ను ఘాటుగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కళంకితుడైన ముఖ్యమంత్రి పినరయి నీచ సిగ్గుమాలిన బుజ్జగింపు రాజకీయాలు ఆడుతున్నారు. ఢిల్లీలో కూర్చొని ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ.. జిహాద్ కోసం బహిరంగ పిలుపులిస్తున్న ఉగ్రవాద హమాస్ కేరళలో అమాయక క్రైస్తవులపై దాడులు, బాంబు పేలుళ్లకు కారణమవుతున్నారు’ అంటూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై కేరళ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.
Also Read..
Chandrababu | చంద్రబాబు బెయిల్కు ఏపీ హైకోర్టు పెట్టిన 5 షరతులు ఇవే!
Mukesh Ambani | అంబానీకి 4 రోజుల్లో మూడో బెదిరింపు మెయిల్.. ఈసారి 400 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్