Onavillu | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్నది. గర్భాలయంలో శ్రీరాముడి కొలువుదీరనున్న క్షణాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. మరో వైపు ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య రామయ్య ఆలయానికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు ఆలయాలు, ధార్మిక సంస్థలు కానుకలను పంపాయి. తాజాగా కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం సైతం శ్రీరాముడికి కానుకగా ‘ఓనవిలు’ అందజేయనున్నది. ఒనవిల్లు ఇది చిన్న విల్లు ఆకారంలో ఉంటుంది. విల్లు ఆకారంలో ఉండే.. చెక్క పలకకు రెండు వైపులా దశావతారాలు, శ్రీరామ పట్టాభిషేకం వంటి బొమ్మలు చెక్కి ఉంటాయి.
ఓనవిల్లు రెండు పదాల నుంచి వచ్చిందని.. ఓనం (కేరళ పండుగ), విల్లు (బాణం) నుంచి వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఒనవిల్లులను ఓనం పండుగ సమయంలో ఆలయానికి భక్తులు అందజేస్తారు. ఓనం సందర్భంగా మూడు రోజుల పాటు ఆలయంలో ఒనవిల్లులను ఉంచి.. ఇండ్లకు తీసుకెళ్తారు. దాంతో కుటుంబం బాగుంటుందని ప్రజలు భావిస్తుంటారు. ఈ ఓనవిల్లును ఇవాళ ఆలయంలో జరిగే కార్యక్రమంలో పద్మనాభస్వామి ఆలయ అర్చకులు, ఆలయ పరిపాలన కమిటీ సభ్యులు ఈ ఓనవిలును శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు అందజేయనున్నారు.
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. జనవరి 22న ఆలయ గర్భగుడిలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇదిలా ఉండగా.. పద్మనాభ స్వామి ఆలయం సైతం మహా విష్ణువు అవరాతాల్లో ఒకటి. రాముడు సైతం మహావిష్ణువు అవతారమే. కేరళ త్రివేండంలో కొలువైన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. పురాణాల్లోనూ ఈ ఆలయ ప్రస్తావన ఉన్నది. శ్రీమద్ భాగవతం ప్రకారం బలరాముడు సైతం ఆలయాన్ని సైతం దర్శించాడు. ఆ సమయంలో పవిత్రమైన పద్మతీర్థం సరస్సులో స్నానమచరించి.. పద్మనాభుడిని దర్శనం చేసుకున్నారు.