తిరువనంతపురం: కేరళలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. శస్త్ర చికిత్స చేయించుకుని అప్పుడప్పుడే మత్తు నుంచి తేరుకుంటున్న ఓ మహిళపై ఆ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలోని కోజికోడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ మహిళ అనారోగ్యంతో కోజికోడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అడ్మిట్ అయ్యారు. ఆదివారం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు ఆస్పత్రి ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. ఈ క్రమంలో ఐసీయూలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అనస్థీషియా మత్తులో ఉన్న బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, అప్పుడప్పుడే మత్తు నుంచి తేరుకుంటున్న మహిళ నిందితుడిని ప్రతిఘటించలేకపోయింది.
అనంతరం మత్తు నుంచి పూర్తిగా తేరుకున్న తర్వాత ఆస్పత్రి సిబ్బందికి, తన కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కోజికోడ్ పోలీసులు కేసు నమోదు చేసి.. ఇవాళ ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనపై డిపార్టుమెంటల్ విచారణ కూడా జరిపించాలని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ను ఆదేశించారు.