తిరువనంతపురం : భార్యను మరో మహిళతో పోల్చడం మానసిక వేధింపుల కిందకు వస్తుందని కేరళ హైకోర్టు పేర్కొంది. విడాకుల కేసు విచారణలో భాగంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య తన అంచనాలకు తగ్గట్టు లేదని భర్త నిత్యం హింసిస్తే అది మానసిక వేధింపులేనని కోర్టు స్పష్టం చేసింది.
2019లో వివాహమైన వ్యక్తి తన భార్యతో విభేదాల కారణంగా విడాకులు కోరుతూ డైవర్స్ పిటిషన్ దాఖలు చేయగా ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తాను అందంగా లేనంటూ భర్త నిత్యం వేధిస్తుండటంతో తాను కుంగుబాటుకు లోనయ్యానని, మానసిక క్షోభకు గురయ్యానని మహిళ కోర్టుకు తెలిపింది. భార్యను ఇతర మహిళతో పోలిస్తూ వ్యాఖ్యలు చేయడం మానసిక వేధింపుల కిందకు వస్తాయని కేసును విచారించిన జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ సీఎస్ సుధతో కూడిన హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.
మ్యారేజ్ కౌన్సెలర్ను సంప్రదించి విడిపోయిన జంట తిరిగి కలుసుకునేందుకు ప్రయత్నించాలని కోర్టు కోరింది. భార్య, భర్త విడిపోయి చాలా కాలం వేరుగా ఉంటూ వారిలో ఎవరో ఒకరు విడాకులకు కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు వైవాహిక బంధం విచ్ఛిన్నమైందని చెప్పవచ్చని కోర్టు పేర్కొంది.