Kerarala CM | ఓ యువ వైద్యురాలి హత్యకు సంబంధించిన కేసులో బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్పై కేరళ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. కొట్టాయం జిల్లాలోని కడుతురుతి ప్రాంతానికి చెందిన డాక్టర్ వందనా దాస్ (23) తల్లిదండ్రుల ఏకైక సంతానం. యువ వైద్యురాలు డ్యూటీలో ఉండగా ఓ వ్యక్తి కత్తి దాడి చేశాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించింది. అయితే, డాక్టర్ వందనా దాస్ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేసింది. అలాగే హత్యానంతరం దాఖలైన సుమోటో కేసుతో పిటిషన్ను ట్యాగ్ చేయాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా.. సందీప్ అనే సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులతో గొడవపడి కాలికి దెబ్బ తగిలించుకోవడంతో అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గాయానికి చికిత్స చేస్తున్న సమయంలో సందీప్ అక్కడే ఉన్న కత్తెర, శస్త్ర చికిత్సకు వినియోగించే బ్లేడ్తో డాక్టర్ వందనా దాస్పై దాడి చేశాడు. తీవ్ర గాయాలకు గురైన ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండాపోయింది. నిందితుడి దాడిలో పోలీసు సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. యువ వైద్యురాలి హత్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు నిరసన తెలిపారు. హత్యకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఆసుపత్రుల్లో వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువ వైద్యురాలి హత్యపై రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది. వైద్యుల నిరసనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ సేఫ్టీ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది.