న్యూఢిల్లీ, మార్చి 16: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై స్టే విధించాలని కోరుతూ కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా మరో పిటిషన్ వేశారు. ఇప్పటికే అస్సాంలో పూర్తై, దేశవ్యాప్తంగా చేపట్టాలని అనుకొంటున్న జాతీయ పౌరసత్వ రిజిస్టర్తో(ఎన్ఆర్సీ) పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధం ఉన్నదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
సరిగ్గా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏ-2019ను దేశవ్యాప్తంగా అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈనెల 11న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈనెల 19న ఒకేసారి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇప్పటికే అంగీకరించారు.