Kerala Governor | కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, పినరయి విజయన్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వీసీల నియామకం విషయంలో గవర్నర్ రాజకీయంగా జోక్యం చేసుకుంటున్నారంటూ సీఎం పినరయి విజయన్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా గవర్నర్ స్పందించారు. సీఎం చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.
తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. లేనిపక్షంలో మీరు ఆ పని చేస్తారా..? అంటూ సీఎం పినరయికి గవర్నన్ సవాల్ విసిరారు. ‘ఆరెస్సెస్కు చెందిన వ్యక్తులను వీసీలుగా నియమించేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆరెస్సెస్ కాదు నా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ వ్యక్తిని నియమించినా నేను రాజీనామా చేస్తా. నాపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే మీరు ఆ పనిచేస్తారా..?’ అని సీఎం పినరయి విజయన్కు గవర్నర్ సవాల్ విసిరారు.