Arif Mohammed | ఎప్పుడూ వార్తల్లో ఉండే కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. మరో కొత్త వివాదానికి తెరలేపారు. విద్యావేత్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తనను హిందువుగా పిలవాల్సిందే అని పట్టుబట్టారని చెప్పిన ఈయన.. తనను కూడా హిందువు అని పిలవాలని సూచించారు. హిందూ అనేది మతపరమైన పదం కాదని, భౌగోళిక పదమని కొత్త భాష్యం చెప్పారు. భారతదేశంలో పుట్టి ఇక్కడే నివసించే వారినందరినీ హిందువులనే పిలవాలన్నారు. భారతదేశంలో పుట్టినా, భారతదేశంలో పుట్టిన గింజలు తిన్నా.. ఇక్కడి నదుల నీరు తాగినా.. అలాంటి వారిని హిందువుగా పిలువడానికి అర్హులని చెప్పారు. బ్రిటీష్ వారు మతం ఆధారంగా మనల్ని విభజించడం వల్లనే ఇన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని పేర్కొన్నారు.
ఉత్తర అమెరికాలో స్థిరపడిన మలయాళీ హిందువులు తిరువనంతపురంలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనాన్ని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీబీసీ డాక్యుమెంటరీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. భారత్ను వంద ముక్కలుగా చూడాలనుకునే వారు కలత చెందుతున్నారని, అందుకే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మన దేశాన్ని చీకట్లో చూడాలనుకునే వారి కుట్రలే ఇవి అని అన్నారు.
భారతదేశం పేద దేశం కాదని, భారతదేశ సంపదపై అత్యాశతో బయటి వారు ఇక్కడికి వచ్చారని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తెలిపారు. వీరి కారణంగానే 1947 నాటికి మనం దక్షిణాసియాలో పేదరికానికి చిహ్నంగా మారామని, అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ప్రస్తుతం భారతీయులు ప్రపంచంలోని అనేక పెద్ద బహుళజాతి కంపెనీల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారని, దీన్ని బట్టే ప్రపంచం భారత్ సామర్థ్యాన్ని గుర్తిస్తున్నదన్నారు.