కొచ్చి: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ జైలు నుంచి విడుదలైంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నేరం కింద స్వప్న సురేష్ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గత ఏడాది జూలైలో అరెస్ట్ చేసింది. ఇటీవల ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా నవంబర్ 2న కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 లక్షల బాండు, ఇద్దరి పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది.
స్వప్న సురేష్ను 2020, జూలై 11న ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి 16 నెలలుగా ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నది. కాగా, కేరళలో దౌత్య మార్గాల ద్వారా బంగారం అక్రమ రవాణా జరిగింది. అదే క్రమంలో 2019, జూలై 5న తిరువనంతపురం ఎయిర్పోర్టులో రూ.14.82 కోట్ల విలువ చేసే 30 కిలోల బంగారం పట్టుబడింది. దౌత్యపరమైన పార్శిల్ పేరుతో తరలిస్తున్న బ్యాగేజీపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు చెక్ చేయడంతో బండారం బయటపడింది.
ఈ కేసులో ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), కస్టమ్స్ డిపార్టుమెంట్ విచారణ జరుపుతున్నాయి.