Kerala Exit Poll : కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కేరళంలో ఈసారి అధికార ఎల్డీఎఫ్ కూటమికి విజయావకాశాలు తక్కువే. మరోవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్కు విజయావకాశాలు పెరిగాయి. ఇదే అంశంపై తాజాగా టుడేస్ చాణక్య సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్ని వెల్లడించింది. ఈ సంస్థ అంచనా ప్రకారం కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ ఉండనుంది.
బీజేపీ మాత్రం నామమాత్రపు ఫలితాల్ని సాధించనుంది. అయితే, రెండు కూటముల మధ్య పోటీ కారణంగా బీజేపీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాల్ని కొట్టిపారేయలేం. కేరళం అసెంబ్లీలో 140 సీట్లున్నాయి. మెజారిటీ సాధించాలంటే 71 సీట్లు కావాలి. టుడేస్ చాణక్య అంచనా ప్రకారం.. అధికార ఎల్డీఎఫ్ కూటమికి 64 సీట్లు రావొచ్చు. అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమికి 69 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. బీజేపీకి 7 సీట్లు రావొచ్చు. అంటే ఏ కూటమికి పూర్తిస్థాయి మెజారిటీ రావడం లేదు. రెండింట్లో ఏ కూటమికి మెజారిటీ రాకపోతే బీజేపీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ, ఇక్కడే ఒక మెలిక ఉంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్.. రెండూ బీజేపీకి వ్యతిరేక కూటములే.
అందువల్ల ఏ కూటమికి కూడా సరైన మెజారిటీ రాకపోతే ఆయా కూటములు బీజేపీతో కలుస్తాయా అనేది కీలక ప్రశ్న. అయితే, రెండు కూటముల్లోని పార్టీలతో సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఈసారి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమిదే విజయమని ఇతర సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. యూడీఎఫ్లో కాంగ్రెస్ పార్టీ కీలకం. ఎల్డీఎఫ్లో సీపీఐ (ఎం) కీలకం. ఇప్పుడు అక్కడ ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. మే 4న ఫలితాలు వెల్లడయ్యేంత వరకు ఈ అంశంపై సందిగ్ధత కొనసాగడం ఖాయం.