తిరువనంతపురం: ఒక వ్యక్తికి శరీరం, చేతులు వణికే రోగం ఉన్నప్పటికీ అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తున్నాడు. కేరళలోని కొచ్చికి చెందిన శిజీకి చిన్నప్పటి నుంచి శరీరం, చేతులు వణుకుతాయి. అయితే అతడి సోదరులు ఆయనకు సూక్ష్మ కళను నేర్పించారు. దీంతో శిజీ తన శారీరక లోపాన్ని అధిగమించి అద్భుతమైన కళాఖండాలు తయారు చేస్తున్నాడు.
సృజనాత్మకతో శిజీ చేసిన హెలీకాప్టర్, యుద్ధ నౌక, డబుల్ డెక్కర్ బస్సు, ఆటో రిక్షా, బస్సు, వ్యాను, తాజ్మహల్ వంటి ఎన్నో ఆకట్టుకుంటున్నాయి. ప్యాకింగ్ బాక్సులు, చిన్న పైపులు, చిన్న సీసాలు, వాటి మూతలను ఉపయోగించి ఈ కళాకృతులను తయారు చేసినట్లు తెలిపాడు.
తాను డ్రా చేసేటప్పుడు, తినేటప్పుడు లేదా మంచి నీరు త్రాగేటప్పుడు తన చేయి వణుకుతుందని శిజీ తెలిపాడు. కొన్నిసార్లు భోజనం చేసేటప్పుడు కూడా ఆహారం ముఖం మీద పడుతుందని చెప్పాడు. అయితే తన సోదరులు తనకు ఈ సూక్ష్మ కళను నేర్పించారని, దీంతో శ్రద్ధ, పట్టుదలతో కళాకృతులు తయారు చేస్తున్నట్లు వెల్లడించాడు.
కాగా, ఎంతగానో ఆకట్టుకుంటున్న శిజీ అద్భత కళాఖండాలను చూసి పలువురు అతడ్ని ప్రశంసించారు.