న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 46 వేల కొత్త కరోనా పాజిటివ్ ( Corona Positive ) కేసులు నమోదు అయ్యాయని, దాంట్లో 58 శాతం కేసులు కేరళ రాష్ట్రంలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగితా అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు ఆయన వెల్లడించారు. కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటిందని, ఇక మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఏపీల్లో లక్ష లోపే కేసులు ఉన్నాయన్నారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న కేసుల్లో 51 శాతం కేసులు కేరళ, మహారాష్ట్రలో 16 శాతం కేసులు ఉన్నట్లు తెలిపారు. మిగితా రాష్ట్రాలన్నీ కేవలం 5 శాతం లోపే ఉన్నట్లు చెప్పారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 80 లక్షల టీకా డోసులను ఇచ్చినట్లు భూషణ్ వెల్లడించారు.