తిరువనంతపురం: కేరళలో 11వ తరగతి పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఆ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, పరీక్షలను వారం రోజుల పాటు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ‘కేరళలో ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నది. దేశంలో 70 శాతానికి పైగా కరోనా కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. దాదాపు 35,000 రోజువారీ కేసులు రికార్డవుతున్నాయి. చిన్న వయసు పిల్లలు కరోనా వ్యాప్తి ప్రమాదానికి గురికాకూడదు’ అని జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కేరళలో ఈ నెల 6 నుంచి ప్రారంభంకానున్న ఆఫ్లైన్ 11వ తరగతి పరీక్షల నిర్వహణపై స్టే విధించింది. ఈ పరీక్షలను వారం పాటు నిలిపివేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.