న్యూఢిల్లీ : కాలుష్య కాసారంగా మారిన యమునా నదిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు ప్రక్షాళన చేసి, అందులో తలస్నానం చేస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. యమునా నది ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ఆరు పాయింట్లతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. 70 సంవత్సరాల్లో యమునా నది మురికిగా మారిందని, దీన్ని రెండు రోజుల్లో శుభ్రం చేయలేమన్నారు. వచ్చే ఎన్నికల నాటికి నదిని శుభ్రం చేస్తామని ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చానన్నారు.
యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించామన్నారు. ఆరు పాయింట్ల యాక్షన్ ప్లాన్ను తానే వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానన్నారు. మొదట కార్యాచరణ ప్రణాళికలో మురుగునీటి శుద్ధిపై కసరత్తు చేస్తున్నామన్నారు. రెండోదాంట్లో ఇప్పటికే ఉన్న ప్లాంట్ల సామర్థ్యం పెంచడం, మూడోది పాత ట్రీట్మెంట్ ప్లాంట్ల సాంకేతికతను మార్చడం, నాల్గోది జుగ్గీ జోప్రీ క్లస్టర్ల నుంచి నదులలోకి వెళ్లే వ్యర్థాలను సీవర్ నెట్వర్క్కు అనుసంధానం చేస్తామని చెప్పారు. మురుగునీటి నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో నామమాత్రపు ఛార్జీలతో గృహ కనెక్షన్లను ప్రభుత్వం అందిస్తుంది.
ఇంతకు ముందు వినియోగదారులే కనెక్షన్ తీసుకోవాల్సి ఉండేది. ఐదో కార్యాచరణలో డీసిల్టింగ్, మురుగు కాలువల పునరుద్ధరిస్తామన్నారు. ఆరోదాంట్లో పారిశ్రామిక వ్యర్థాలను యమునా నదిలోకి వదులుతున్న పరిశ్రమలను ప్రభుత్వం మూసివేస్తుందని ఢిల్లీ సీఎం చెప్పారు. ఈ ఆరు పాయింట్లు అమలు చేయడం ద్వారా ఫిబ్రవరి 2025 నాటికి యమునా నదిని శుభ్రపరచగలమని ఇంజినీర్లు, అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారన్నారు. ఇటీవల ఛఠ్ పూజ సందర్భంగా యమునా నది కాలుష్యంపై ప్రతిపక్షాల నుంచి కేజ్రీవాల్ సర్కారుకు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.