న్యూఢిల్లీ, జనవరి 18: ఢిల్లీ మద్యం విధానం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగోసారి కూడా ఈడీ ముందు విచారణకు హాజరుకాలేదు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ఆయన మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలో భాగంగానే తనకు ఈడీ సమన్లు జారీచేస్తున్నదని ఆరోపించారు.
ఢిల్లీ బడ్జెట్ సన్నాహాల్లో తాను బిజీగా ఉన్నానని ఈడీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం కోసం ఆయన గోవా పర్యటనకు వెళ్లారు. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ సూత్రధారి అని, అందుకే ఆయన తనను అరెస్ట్ చేస్తారనే భయంతో వణికిపోతున్నారని బీజేపీ విమర్శించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ ఈడీ విచారణను తప్పించుకొనే బదులు వాటిని కేజ్రీవాల్ కోర్టులో ఎందుకు సవాల్ చేయడం లేదని ప్రశ్నించారు.