న్యూఢిల్లీ : తప్పుడు కేసులో మనీష్ సిసోడియాను మోదీ సర్కార్ ఇరికించిందని కాషాయ పార్టీపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా సిసోడియాను నిలువరించేందుకు గుజరాత్ ఫలితాలు వెల్లడయ్యేవరకూ ఆయనను జైల్లో ఉంచుతారని అన్నారు. ఇక ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
సీబీఐ సమస్ల జారీపై అంతకుముందు ట్విటర్ వేదికగా సిసోడియా స్పందించారు. తనను గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా.. నకిలీ కేసులో అరెస్టు చేసేందుకు బీజేపీ ప్లాన్ చేసిందని విమర్శించారు. ‘‘రానున్న రోజుల్లో నేను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. నన్ను ఆపడమే వారి ఉద్దేశం. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది.
బీజేపీ ప్లాన్లో భాగంగా నన్ను నకిలీ కేసులో అరెస్టు చేయనున్నారు. గతంలో నేను గుజరాత్ వెళ్లినప్పుడు ఢిల్లీ తరహా పాఠశాలను నిర్మిస్తానని అక్కడి ప్రజలకు మాట ఇచ్చాను. అది కొందరికి నచ్చడం లేదు. నన్ను జైలుకు పంపడంతో ఎన్నికలు ఆగవు. రానున్న రోజుల్లో ఆ ఎన్నికలు ఉద్యమంలా మారనున్నాయి’’ అంటూ సిసోడియా బీజేపీపై విమర్శలు చేశారు.