డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మార్పు రానుందని, రాష్ట్రంలో నిజాయితీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాము ఉత్తరాఖండ్ను అంతర్జాతీయ హిందువుల రాజధానిగా మలుస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్లో పర్యాటక రంగానికి ఉత్తేజం తీసుకువస్తామని, ఇక్కడి యువతకు వేలాది ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. హరిద్వార్లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఉత్తరాఖండ్లో సత్తా చాటేందుకు ఆప్ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఉద్ధంసింగ్ నగర్ జిల్లాలో జరిగిన కిసాన్ మేళాలో పాల్గొన్న రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల మాటలను పెడచెవినపెడుతూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రైతులు, పేదల కష్టాలను మోదీ సర్కార్ ఆలకించడంలేదని దుయ్యబట్టారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిన్నర పాటు రైతులు ఆందోళన చేపట్టినా మోదీ ప్రభుత్వం మౌనం దాల్చిందని మండిపడ్డారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, పేదల సమస్యలను సావధానంగా విని పరిష్కరించేందుకు ప్రయత్నించిందని వివరించారు. మోదీ హయాంలో అలాంటి పరిస్ధితి లేదని ఆరోపించారు. ఇక ఉత్తరాఖండ్లో మరోసారి అధికారంలోకి రావాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, కాషాయ పార్టీకి దీటైన పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ చెమటోడుస్తోంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆప్ తనదైన వ్యూహాలకు పదునుపెడుతోంది.