Sanjay Singh : తీహార్ జైల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ను వేధిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం సూచనల ఆధారంగా కేజ్రీవాల్కు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. శనివారం ఉదయం ఢిల్లీలో సంజయ్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడారు.
జైలు మాన్యువల్ ప్రకారం.. ములాఖత్కు వచ్చిన వారిని జైల్లో ఉన్న వ్యక్తి ముఖాముఖి కలుసుకునేందుకు తీహార్ జైలు పరిపాలనా యంత్రాంగం అనుమతి ఇచ్చిందని, కానీ కేజ్రీవాల్ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని సంజయ్ సింగ్ ఆరోపించారు. అర్వింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ తన భర్తను ముఖాముఖి కలవాలని దరఖాస్తు పెట్టకుంటే జైలు అధికారులు అనుమతించలేదని, కిటికీ గుండా మాట్లాడుకోవాలని సూచించారని ఆయన తెలిపారు.
కరుడుగట్టిన నేరగాళ్లకు కూడా వాళ్లను కలిసేందుకు వచ్చిన వారితో ముఖాముఖి మాట్లాడేందుకు అనుమతిస్తారని, కేజ్రీవాల్ విషయంలో ఎందుకు అనుమతించరని సంజయ్సింగ్ ప్రశ్నించారు. కేజ్రీవాల్ను మానసికంగా కుంగదీయాలనేది కేంద్ర ప్రభుత్వం కుట్ర అని ఆయన ఆరోపించారు. అర్వింద్ కేజ్రీవాల్ నుంచి హక్కులను లాగేసుకోవద్దని తాను ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని అభ్యర్థిస్తున్నానని సంజయ్ సింగ్ అన్నారు.