కేవలం దేవుడ్ని గర్భగుడిలోనే చూడటం కాదు. ప్రకృతిలోనూ దైవత్వాన్ని చూడటం భారతీయ ధర్మం. ప్రకృతిని కూడా దైవంతో సమానంగా భావించాలన్నదే భారతీయ రుషులు బోధించారు. కానీ.. కేవలం గర్భగుడిలోని దేవుడ్నే దేవుడనుకుంటూ.. గుళ్లకూ గోపురాలకు వేల వేల దండాలు పెట్టేసి వస్తున్నామంటే.. భారతీయత సరిగ్గా అర్థం కానట్టే. ధర్మం సరిగ్గా జీర్ణం కానట్టే.
చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర భారతీయులు ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. లక్షలకు లక్షలు ఖర్చులు చేసుకొని ఆ ప్రాంతాలకు వెళ్తుంటారు. చార్ధామ్ యాత్ర కింద వచ్చే దేవాలయాలు, ఆ ప్రదేశాలన్నీ దేవతా భూములుగానే రుషులు పేర్కొంటారు. అవన్నీ దేవతా భూములే. అక్కడ వుండే ప్రతి చెట్టు, పుట్ట, రాయి రప్ప.. ఇలా అవన్నీ దేవతా గణములేనని, యోగులని సంప్రదాయం చెబుతోంది.
ఇవేవీ ఆలోచించకుండా.. అక్కడి ప్రాశస్త్యాన్ని ఏమాత్రం తెలుసుకోకుండా.. వెళ్లేసి.. అక్కడి వాతావరణాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను విపరీతంగా కలుషితం చేసి వచ్చేస్తున్నాం. ఈ యేడాది చార్ధామ్ యాత్రకు వెళ్లిన భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందట. మంచిదే. కానీ.. వెళ్లిన వారిలో కొందరు అక్కడి నియమాలను ఏమాత్రం పాటించడం లేదట. ప్లాస్టిక్ బ్యాగులు, చెత్త, చెదారం… ఇలా అన్నీ అక్కడే వేసేసి వచ్చేస్తున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడి ప్రదేశాలు చెత్త కుండీల్లాగా తయారయ్యాయట. ముఖ్యంగా కేదార్నాథ్ విషయంలో.
ఈ విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు గుర్తించి, ఆ ఫొటోలను షేర్ చేసి… యాత్రికుల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాయి. ఎట్టు చూసినా…. ప్లాస్టిక్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, వ్యర్థ పదార్థాలేనట. వీటితో అక్కడి వాతావరణం విపరీతంగా దెబ్బతిని పోతోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఎక్కడికక్కడ చెత్తా, చెదారం, ప్లాస్టిక్ కుప్పలు విపరీతంగా పెరిగిపోవడం చార్ధామ్ లాంటి సున్నిత ప్రాంతాల్లో లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. జీవావరణానికే పెద్ద ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013 నాటి ఉపద్రవాన్ని ఒక్కసారి అందరూ గుర్తుకు తెచ్చుకోవాలని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.