న్యూఢిల్లీ, మే 26 (నమస్తే తెలంగాణ) : సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి విపక్ష పాలిత రాష్ర్టాలను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం జరిగే నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు సహా పలువురు విపక్ష సీఎంలు బహిష్కరించారు. సమాఖ్య వాదం ఒక జోక్ అయినప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం వల్ల కలిగే ప్రయోజనం ఏముందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. సమావేశానికి తాను హాజరుకాబోనని ప్రధానికి శుక్రవారం ఆయన లేఖ రాశారు.
ఢిల్లీ పాలనాధికారాలపై కేంద్రం ఆర్డినెన్స్ను ప్రస్తావిస్తూ.. ప్రధానమంత్రే సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించనప్పుడు, తాము న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి, చీఫ్ సెక్రటరీని నీతి ఆయోగ్ సమావేశానికి పంపుతామన్న పశ్చిమ బెంగాల్ విజ్ఞప్తిని కేంద్రం పరోక్షంగా తిరస్కరించింది. ‘సీఎం హాజరు కావొచ్చు’ అని సూచించింది. దీంతో సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్న మమతా బెనర్జీ తన ప్రతినిధులను కూడా పంపకూడదని నిర్ణయం తీసుకున్నారు. బీహార్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు సమావేశంలో ‘వికసిత భారతం@ 2047:టీమ్ ఇండియా పాత్ర’ ఇతివృత్తంగా మహిళా సాధికారత, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి మొదలైన 8 అంశాలపై చర్చించనున్నారు.