తిరువనంతపురం: టీమిండియా క్రికెటర్ ఎస్ శ్రీశాంత్(Sreesanth)పై విధించిన మూడేళ్ల నిషేధాన్ని కేరళ క్రికెట్ సంఘం ఎత్తివేసింది. కేరళ క్రికెట్ సంఘంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ క్రికెటర్పై నిషేధాన్ని విధించారు. ఇవాళ జరిగిన క్రికెట్ సంఘం స్పెషల్ జనరల్ బాడీ సమావేశంలో కేసీఏ ఈ నిర్ణయం తీసుకున్నది. దీనిపై క్రికెట్ సంఘం ప్రకటన చేసింది. క్రికెటర్ శ్రీశాంత్ క్షమాపణలు చెప్పడంతో క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. కేసీఏ పట్ల చేసిన వ్యాఖ్యలకు ఆయన పాశ్చాతాపాన్ని వ్యక్తం చేశారు. గతంలో కేరళ క్రికెట్ లీగ్ మ్యాచ్ల సమయంలో శ్రీశాంత్పై నిషేధాన్ని విధించారు.
విజువల్, సోషల్ మీడియా ద్వారా శ్రీశాంత్ .. కేరళ క్రికెట్ సంఘాన్ని తప్పుపట్టారు. దీంతో ఆ సంఘానికి చెడు పేరు వచ్చింది. అయితే క్రమశిక్షణా చర్యలను సవాల్ చేస్తూ తిరువనంతపురం మున్సిఫ్ కోర్టులో శ్రీశాంత్ పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం తర్వాత శ్రీశాంత్ అధికారికంగా కేసీఏకు క్షమాపణలు చెప్పారు. ఒకవేళ భవిష్యత్తులో మళ్లీ తప్పు చేస్తే, అప్పుడు క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. బ్యాన్ ఎత్తివేయడం వల్ల ఏరిస్ కొల్లమ్ సెయిలర్స్ ఫ్రాంచైజీకి ఆయన కో-ఓనర్గా కొనసాగనున్నారు.