పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ గుడ్బై చెప్పడంపై కాంగ్రెస్ స్పందించింది. పార్టీ నుంచి నేతలు పోతుంటారు.. వస్తుంటారు.. ఎవర్నీ నిందించలేము అని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షురాలు సోనియాకి ఆయన లేఖ రాశాని, కాంగ్రెస్ సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని మాత్రం అందులో పేర్కొన్నారని, అంతకు మించి, సిబల్ ఏమీ అనలేదని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
అయితే.. సిబల్ తన వైఖరిని పూర్తిగా పేర్కొనలేదని, పూర్తిగా పేర్కొన్న తర్వాతే మరింత స్పందించడానికి వీలవుతుందని కేసీ వేణుగోపాల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ అని, అనేక మంది నేతలు వస్తుంటారు… పోతుంటారని అన్నారు. పార్టీని వీడి వెళ్లేవారెవర్నీ తాను నిందిచాలని భావించడం లేదని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. పార్టీని అతి త్వరలోనే పునర్వవస్థీకరిస్తామని, అందరికీ అందులో బాధ్యతలుంటాయని వెల్లడించారు.
మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి విపక్ష నేతలను వేధిస్తోందని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఏ ప్రభుత్వం కూడా ఉపయోగించని పద్ధతులను ఉపయోగిస్తూ… మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను వేధిస్తోందని మండిపడ్డారు. ఈ పరిణామాలను కచ్చితంగా అధిగమిస్తామన్న నమ్మకం తమకుందని కేసీ వేణుగోపాల్ అన్నారు.