KC Tyagi : బీహార్లో అధికార మహా కూటమికి జేడీయూ గుడ్బై చెప్పడం దాదాపు ఖరారైంది. సీఎం నితీశ్కుమార్ మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా జేడీయూ అధికార ప్రతినిధి, రాజకీయ సలహాదారు కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుస్తున్నాయి.
బీహార్లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీ త్యాగి మీడియాతో మాట్లాడారు. నితీశ్ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందంటూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో నితీశ్ తీవ్రంగా కృషి చేశారని అన్నారు. కూటమిలో ఆయన ఎప్పుడూ పదవులు కోరుకోలేదని చెప్పారు. అలాంటి నితీశ్ ప్రయత్నాలను కాంగ్రెస్ నేతలే తప్పుగా అర్థం చేసుకున్నారని, పదేపదే నితీశ్ను అవమానించారని ఆరోపించారు.
అంతేగాక ఇండియా కూటమి పతనం అంచుకు చేరిందని త్యాగి వ్యాఖ్యానించారు. పంజాబ్, పశ్చిమబెంగాల్, బీహార్లో ఇండియా కూటమి ముగిసిన వ్యవహారంగా పేర్కొన్నారు. అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన బీజేపీని ఇండియా కూటమి పార్టీలు ఎలా ఎదుర్కోగలవని ప్రశ్నించారు. పట్నా వేదికగా వివిధ పార్టీలతో నితీశ్.. కూటమి సమావేశం నిర్వహిస్తే.. ఆ తర్వాత ప్రక్రియంతా మందకొడిగా మారిందన్నారు. ఓ వైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నా కూటమి తరఫున ఉమ్మడి సమావేశం గానీ, ఎజెండా గానీ లేదని త్యాగి విమర్శించారు.