Railway Minister : కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తికావచ్చిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. త్వరలో అక్కడ ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఈ యూనిట్ 200 ఇంటర్ సిటీ రైళ్లను తయారు చేస్తుందని తెలిపారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్పై ఆయన ఇవాళ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ తయారయ్యే రైళ్లను దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చే ఇంటర్ సిటీ రైళ్లు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్తో రూపొందుతాయని అన్నారు. ప్రతి రైలులో 20 కోచ్లు ఉంటాయని అన్నారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రైళ్లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ రైళ్లలో రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుందని అన్నారు. రైలు బ్రేకులు వేసినప్పుడు ఉత్పత్తి అయిన విద్యుత్ను తిరిగి గ్రిడ్లోకి పంపే ఆధునాతన పరిజ్ఞానంతో తయారు చేస్తున్నామని చెప్పారు.