న్యూఢిల్లీ: ప్రముఖ కథక్ నాట్య కళాకారుడు పండిట్ బిర్జూ మహరాజ్ కన్నుమూశారు. న్యూఢిల్లీలోని తన స్వగృహంలో ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 83 ఏండ్ల బిర్జూ మహరాజ్ ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తన మనవళ్లతో ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
బాలివుడ్లో కొన్ని చిత్రాలకు కొరియోగ్రాఫర్గా పనిచేసిన పండిట్ బిర్జూ మహరాజ్ గతకొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శిష్యులు, అనుచరులు ఆయనను పండిట్ జీ, మహారాజ్ జీ అని పిలిచేవారు. బాలివుడ్ సినిమాలైన ఉమ్రాన్ జాన్, దేవదాస్, బాజీరావ్ మస్తానీ తదితర చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు.
బిర్జూ మహరాజ్ తండ్రి అచ్చన్ మహరాజ్, మేనమామలు శంభు మహరాజ్, లచ్చు మహరాజ్ కూడా కథక్ నృత్యకారులు. తన తండ్రి వద్దే ఆయన ఈ సంప్రదాయ నృత్యాన్ని అభ్యసించారు. ఆయన సేవలకుగాను 1986లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం అందించింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పండిట్ బిర్జూ.. డ్రమ్ అద్భుతంగా వాయిస్తారు. దాదాపు అన్ని డ్రమ్స్లను సులభంగా వాయించేవారు. అయన తబలా, నాల్ వాయించడానికి ఆసక్తి చూపేవారు. అదేవిధంగా ఆయనలో ఒక మంచి గాయకుడు కూడా దాగిఉన్నారు.