న్యూఢిల్లీ: కశ్మీరీ పండిట్లు త్వరలో కశ్మీర్ లోయలోని తమ ఇండ్లకు తిరిగి వెళ్తారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. వారు తిరిగి వీడి వెళ్లకుండా ఉండేలా అనుకూలమైన వాతావరణం కోసం పనులు జరుగుతున్నాయని తెలిపారు. మూడు రోజుల ‘నవ్రే’ ఉత్సవాల చివరి రోజున కశ్మీరీ పండిట్లతో వర్చువల్గా ఆయన మాట్లాడారు. కశ్మీర్ లోయలోని ఇళ్లకు తిరిగి వెళ్లాలన్న ప్రతిజ్ఞను నెరవేర్చడానికి కశ్మీరీ పండిట్లకు సమయం ఆసన్నమైందని అన్నారు. దీనికి చాలా రోజులు పట్టదని, త్వరలోనే ఇది సాకారమవుతుందని తెలిపారు. ఈ దిశగా తమ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మన చరిత్ర, మన గొప్ప నాయకులు మనందరికీ మార్గదర్శకంగా, ప్రేరణగా ఉంటారని అన్నారు.
2011లో ఢిల్లీలో జరిగిన శివరాత్రి వేడుకల సందర్భంగా కశ్మీరీ పండిట్లు తమ ఇళ్లకు తిరిగి వెళ్లడంపై అన్న మాటలను మోహన్ భగవత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘ప్రతి ఒక్కరి జీవితంలో సవాళ్లు ఉంటాయి. మూడు-నాలుగు దశాబ్దాల క్రితం మన దేశంలోనే స్థానభ్రంశం చెందిన పరిస్థితిలో మనం ఉన్నాం. దీనికి పరిష్కారం ఏమిటి? మనం లొంగిపోం. ఇళ్లకు తిరిగి వెళ్లడం ద్వారా మన ప్రతిజ్ఞ నెరవేర్చుకుందాం’ అని అన్నారు.
ఇజ్రాయెల్ను ఒక ఉదాహరణగా మోహన్ భగవత్ ప్రస్తావించారు. యూదులు తమ మాతృభూమి కోసం 1800 సంవత్సరాలు పోరాడారని తెలిపారు. ‘ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం కోసం 1700 సంవత్సరాలలో వారు పెద్దగా ఏమీ చేయలేదు. కానీ గత 100 సంవత్సరాలలో ఆ లక్ష్యం సాధించడంతోపాటు ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో ఒకటిగా ఇజ్రాయెల్ అవతరించడం చరిత్ర చూసింది’ అని అన్నారు.
దేశంలో కశ్మీర్ అంతర్భాగమైనప్పటికీ కశ్మీరీ పండితులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసించాల్సి వచ్చిందని మోహన్ భగవత్ తెలిపారు. మనం ఎక్కడైనా జీవించవచ్చు కానీ మా మాతృభూమిని మరచిపోలేమని వ్యాఖ్యానించారు. కశ్మీరీ పండిట్లు తమ ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు ఆర్టికల్ 370 రద్దు దారి చూపిందన్నారు. అతివాదాన్ని ఓడించి అందరితో శాంతియుతంగా జీవించాలని పిలుపునిచ్చారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాను కూడా ఆయన కొనియాడారు. కశ్మీరీ పండిట్ల వాస్తవ పరిస్థితిని ప్రపంచం ముందు ఉంచిందన్నారు.