భయంగా ఉంది..!
మేం ఇక్కడ ఉండలేం.. తరలించండి
ఆరు రోజులుగా నిరసన ప్రదర్శనలు
శ్రీనగర్, మే 18: శివాని పండిత, అజయ్ రైనా ఇద్దరు కశ్మీర్ పండిట్ వర్గానికి చెందిన వారు. వృత్తి రీత్యా టీచర్లు. రాహుల్ భట్ హత్యతో వీళ్లిద్దరు ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఎవరైనా వచ్చి చంపేస్తారేమో అని వణికిపోతున్నారు. ఇది కేవలం ఈ ఇద్దరి మానసిక స్థితి మాత్రమే కాదు. కశ్మీర్లో ఉన్న వేలాది మంది పండిట్లు ప్రాణభయంతో క్షణమొక యుగంగా గడుపుతున్నారు. తమకు తెలియని వ్యక్తి ఎవరు ఎదురొచ్చినా నిలువెల్లా వణికిపోతున్నారు. తమను కశ్మీర్ నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలంటూ బాదామీ బాఘ్ మిలిటరీ కంటోన్మెంట్ దగ్గర ఆరు రోజులుగా కశ్మీర్ పండిట్ ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం తమను వాడుకొని, ఇప్పుడు గాలికొదిలేసిందని మండిపడుతున్నారు.
తాళీ బజావో పేరుతో నిరసన
రాహుల్ భట్ హత్యకు వ్యతిరేకంగా పండిట్ వర్గానికి చెందిన ఉద్యోగులు అనంత్నాగ్ జిల్లాలో ‘తాళీ బజావో’ పేరుతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పళ్లాలు, డప్పులు కొడుతూ తమ ఆవేదనను ప్రకటించారు. హైవే మీదుగా ర్యాలీ నిర్వహించారు. రాహుల్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాలు వదులుకోవడానికీ సిద్ధం
1990ల్లో కశ్మీర్ పండిట్లను ఉగ్రవాదులు తరిమివేసిన తర్వాత తిరిగి మళ్లీ రప్పించడం కోసం కేంద్రప్రభుత్వం పండిట్లకు ఉద్యోగాల ఆశ చూపించింది. ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీ కింద దాదాపు 4వేల మంది కశ్మీర్ పండిట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. అయితే, వాళ్లు కశ్మీర్లో పనిచేయాలన్నది షరతు. ఈ మేరకు బాండ్లు రాయించుకొన్నారు. అయితే ఇప్పుడు వారి భద్రతను గాలికొదిలేసింది.
నేను మళ్లీ బడికి వెళ్లి పాఠాలు చెప్తానని నమ్మకం లేదు. రాహుల్ను చంపేసిన తర్వాత చాలా భయంగా ఉంది. నేను ఉద్యోగంపై దృష్టి పెట్టలేకపోతున్నాను
–శివాని పండిత