జమ్ము, జూన్ 11: 1990వ దశకంలో జరిగిన కశ్మీరీ పండిట్ల ఊచకోత, వలసలపై తెరకెక్కించిన ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలందరూ పనిగట్టుకొని మరీ ప్రచారం చేశారు. ఇప్పుడు అదే కశ్మీరీ పండిట్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలస వెళ్లిపోతున్నా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మాట పెగలడం లేదు. తాజా వలసలతో కశ్మీర్ లోయలోని పండిట్ల నివాస ప్రాంతాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వందలాది సంఖ్యలో జమ్ము, ఇతర సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లిపోవడంతో ఆయా ప్రాంతాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఇంకా ఈ వలసలు కొనసాగుతున్న పరిస్థితి అక్కడ నెలకొన్నది. వలస వెళ్లిపోయిన వారిలో వందలాది మంది జమ్ములో ఆశ్రయం పొందుతున్నారు. ఈ సందర్భంగా వారిని న్యూస్18, క్వింట్ తదితర మీడియా సంస్థలు పలుకరించాయి. కశ్మీర్లో పరిస్థితులపై పండిట్లు ఆందోళన వ్యక్తం చేశారు. భయంతో తాము లోయలో బతుకలేమన్నారు.
జమ్ముకు బదిలీ చేయాలని డిమాండ్
జమ్ముకు చేరుకున్న సాహిల్ అనే పీఎం ప్యాకేజీ ఉద్యోగి మాట్లాడుతూ ‘1990లో వలస పోయినట్లే.. ఇప్పుడు కూడా మా ప్రాణాలు కాపాడుకోవాలని అనుకున్నాం. మూకుమ్మడిగా వలస వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నారు. కశ్మీర్లోనే జిల్లా కేంద్రాలకు బదిలీ చేస్తే ఉగ్రవాదుల దాడులు, హత్యలు ఆగుతాయా? అని ప్రశ్నించారు. ‘జిల్లా కేంద్రాల్లో పండిట్లు ఎక్కడికీ ప్రయాణాలు చేయరా? మార్గమధ్యలో ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?’ అని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. జమ్ముకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నా కేంద్రం, జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇంతకుముందు కూడా మైనారిటీల హత్యలు చూశామని, అయితే ఈసారి ఉగ్రవాదులు లక్షిత హత్యలకు పాల్పడుతున్నారని సురేందర్ రైనా అనే ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. చంపే ముందు పేరు, అడ్రస్ వంటివి అడుగుతున్నారని, ఇటువంటి భయానక పరిస్థితుల్లో తాము కశ్మీర్లో సురక్షితంగా ఎలా బతుకగలమని అన్నారు. కశ్మీర్ లోయ బయటి ప్రాంతాలకు బదిలీ చేయాలనే తమ డిమాండ్ అని, భయంతో కశ్మీర్లో విధులు నిర్వహించలేమన్నారు.
కశ్మీర్ వెళ్లి ప్రాణాలు పణంగా పెట్టలేను!
ఇంకా కట్టుబట్టలతో వలస వచ్చేసిన కశ్మీరీ పండిట్ల పరిస్థితి దయనీయంగా ఉన్నది. 28 ఏండ్ల విజయ్ భట్ అనే కశ్మీరీ పండిట్ ఆర్నెళ్ల క్రితం పీఎం ప్యాకేజీ కింద కశ్మీర్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగంలో చేరారు. అతను కశ్మీర్లో తాను అద్దెకు ఉండే ఇంట్లోని వస్తువులన్నింటినీ వదిలేసి జమ్ముకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు అతను తన జీవనోపాధి కోసం ఇరుగుపొరుగు పిల్లలకు ట్యూషన్లు చెప్పాలని అనుకుంటున్నాడు. కశ్మీర్కు వెళ్లి తన ప్రాణాలను పణంగా పెట్టలేనని, కుటుంబాన్ని నడపాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. శీతల్ కౌల్ అనే ఉపాధ్యాయురాలిని ఇటీవల కశ్మీర్లోని కుప్వారా నుంచి శ్రీనగర్కు బదిలీ చేశారు. విధులకు తిరిగి హాజరవుతారా? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. కశ్మీర్లో పరిస్థితులు అలానే కొనసాగితే తిరిగి వెళ్లడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. పరిస్థితులు చక్కబడినప్పటికీ, భయం పోదని మరో టీచర్ అన్నారు.
చేసిన బదిలీల్లోనూ పక్షపాతం
కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు మీటింగ్లు జరిపారు. పీఎం ప్యాకేజీ ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేస్తామని ప్రకటనలు చేశారు. నామ్కేవాస్తేగా కొద్ది మందిని ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా బీజేపీ నేతల బంధువులు, వారి సిఫారసులు ఉన్నవారికి తరలించారని కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ పక్షపాత వైఖరిపై ఇతర పండిట్లు, హిందూ వర్గాల ఉద్యోగులు ఆందోళనలు కూడా చేశారు.