(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): భూలోక స్వర్గంగా చెప్పుకొనే కశ్మీర్లో విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది. రోజుకు 12-16 గంటల పాటు పవర్ కట్స్ ఉంటున్నట్టు స్థానికులు వాపోతున్నారు. గడిచిన రెండు దశాబ్దాల్లో ఈ స్థాయి కరెంటు సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. 70 లక్షల మంది జనాభా ఉన్న కశ్మీర్లో విద్యుత్తు డిమాండ్ 1800 మెగావాట్లుగా ఉంటుంది. ఈ చలికాలం విద్యుదుత్పత్తి 50-100 మెగావాట్లు దాటలేదని అధికారులు చెబుతున్నారు.
అయితే, రాజస్థాన్ తదితర రాష్ర్టాలతో గతంలో చేసుకొన్న ఒప్పందాల మేరకు విద్యుత్తును ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే.. కశ్మీర్లోని రాతల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్హెచ్పీసీఎల్), జమ్ముకశ్మీర్ యంత్రాంగం.. రాజస్థాన్ ప్రభుత్వంతో మరో విద్యుత్తు సరఫరా ఒప్పందాన్ని చేసుకొన్నది.
జనవరి 3న చేసుకొన్న ఈ డీల్ ప్రకారం.. రాజస్థాన్కు ఆర్హెచ్పీసీఎల్ వచ్చే 40 ఏండ్లపాటు విద్యుత్తును సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనిపై అక్కడి విపక్ష పా ర్టీలు మండిపడుతున్నాయి. అసలే విద్యుత్తు కోతలతో కశ్మీరీ ప్రజలు ఇబ్బందు లు పడుతుంటే, ఇలాంటి ఒప్పందాలు చేసుకోవడమేంటని అధికార యంత్రాంగాన్ని నిలదీస్తున్నాయి.