జమ్ము: ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు, నిరసనలకు దూరంగా ఉండాలని జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మెలు, ధర్నాల్లో పాల్గొనేవారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
వందలాది మంది ఉద్యోగులను ఏకపక్ష నిర్ణయంతో ఉద్యోగాల నుంచి తొలగించడం, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారనే ఆరోపణలపై దాదాపు 50 మంది ఉద్యోగులను తొలగించిన కొద్ది రోజులకే ఈ సర్క్యులర్ జారీ కావడం గమనార్హం. ఇటీవల కాలంలో అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు వేలాది కాంట్రాక్టు ఉద్యోగులు తమ జీతాలు పెంచాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని సమ్మె చేస్తున్నారు. అసమ్మతి తెలిపే ప్రతి గళాన్ని అణచివేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నదని విపక్షాలు విమర్శించాయి.