Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కొద్దిరోజులు సమయం కోరారు. చైనా పౌరులకు వీసాలు జారీ చేసిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కార్తీ చిదంబరానికి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈడీ కోరుతున్న పత్రాలు కేసులు సంబంధించినవి కావన్నారు. ఆ పత్రాలను సేకరించేందుకు సమయం కావాలన్నారు. డిసెంబర్ 12న విచారణ అధికారి ముందు హాజరుకావాలని కార్తీ చిదంబరాన్ని ఈడీ గతంలో ఆదేశించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో విచారణకు హాజరుకాలేదు. మళ్లీ 16న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది.
మళ్లీ ఆయనకు విచారణకు గైర్హాజరయ్యారు. తన లాయర్ ద్వారా ఈడీకి వంద పేజీల సమాధానాన్ని పంపారు. ఎన్నికల అఫిడవిట్, ఆదాయపు పన్ను రిటర్న్లు, బ్యాంకు ఖాతాల సమాచారం, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను సైతం జత చేశారు. దర్యాప్తు సంస్థ కోరిన అన్ని పత్రాలను సేకరించేందుకు వీలుగా విచారణకు హాజరయ్యేందుకు మరికొద్ది రోజులు మినహాయింపు ఇవ్వాలన్నారు. అయితే, కార్తీ చిదంబరం విజ్ఞప్తిని ఈడీ పరిశీలనలోకి తీసుకుంటుందా? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. ఈడీ కోరిన పత్రాల కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో తనకు, తన కుటుంబానికి సంబంధించిన ఆర్థిక పత్రాలను కోరాల్సిన అవసరం లేదన్నారు.