న్యూఢిల్లీ : వీసా కోసం ముడుపుల కేసులో దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు బదులిచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం శనివారం వరుసగా మూడోరోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు.2011లో తన తండ్రి పీ చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో 263 మంది చైనీయులకు అక్రమంగా వీసాలు జారీ చేశారనే కేసులో కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద కార్తీ చిదంబరం మాట్లాడుతూ టెస్ట్ మ్యాచ్ ఐదురోజుల పాటు జరుగుతుంది..ఇది (విచారణ) మూడో రోజని వ్యాఖ్యానించారు. తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని తాను స్పీకర్కు లేఖ రాశానని, స్సీకర్ స్పందన కోసం వేచిచూస్తున్నానని పేర్కొన్నారు.
పార్లమెంట్ సభ్యుడిగా తన హక్కులను ఉల్లంఘించేలా దర్యాప్తు అధికారులు జోక్యం చేసుకుంటున్నారని, తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కార్తీ చిదంబరం స్పీకర్కు రాసిన లేఖలో వివరించారు. ఇక ఈ కేసులో కార్తీ చిదంబరానికి, ఆయన సన్నిహితుడు ఎస్ భాస్కరరామన్కు రూ 50 లక్షల ముడుపులు ముట్టాయని తాజా కేసులో సీబీఐ కార్తీ చిదంబరం ఇతరులపై మే 14న తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.