NIA raids: కర్నిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గోగమేది హత్య కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ హత్య కేసుతో సంబంధం కలిగి ఉన్న నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం నుంచి హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.
స్థానిక పోలీసులతో కలిసి పలు ఎన్ఐఏ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఈ హత్య కేసులో పేరు మోసిన గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో కేంద్ర హోంశాఖ ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను రాజస్థాన్ పోలీసుల నుంచి ఎన్ఐఏకు అప్పగించింది. కాగా, కర్నిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గత నెల 5న జైపూర్లోని తన నివాసంలో హత్యకు గురయ్యారు.
ముగ్గురు షూటర్లు తుపాకులతో వచ్చి సుఖ్దేవ్ను కాల్చిచంపారు. ఈ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన రోహిత్ గొదార అనే గ్యాంగ్స్టర్ హస్తం ఉన్నది. డిసెంబర్ 9న ఈ హత్యతో సంబంధం ఉన్న షూటర్లు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీలను చండీగఢ్లో అరెస్ట్ చేశారు. రోహిత్ గొదారా ఆదేశాల మేరకే తాము ఈ హత్య చేశామని నిందితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.