Sharad Pawar | దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కర్ణాటక వ్యూహాలను (Karnataka Template) అనుసరించాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు. కర్ణాటక (Karnataka) లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో మహారాష్ట్ర మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి నేతలు ఆదివారం ముంబై (Mumbai)లోని ఎన్సీపీ అధినేత (NCP president ) శరద్పవార్ నివాసంలో భేటీ అయ్యారు. ప్రస్తుత దేశ రాజకీయాలు, బీజేపీకి ప్రత్యామ్నాయాలపై వారు చర్చించారు. సమావేశం అనంతరం పవార్ మాట్లాడుతూ.. కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని ప్రశంసించారు.
‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ సందేశాన్ని ఇచ్చాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కర్ణాటక తరహా పరిస్థితిని కల్పించేందుకు కృషి చేయాలి. దీని కోసం భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి. కర్ణాటకలో బీజేపీపై కాంగ్రెస్ ఒంటరిగానే పోరాడింది. ఇతర రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు కలిసి ముందడుగు వేయాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి’ అని పవార్ అన్నారు. ‘బీజేపీ పతనం ప్రారంభమైంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయం’ అని డి.రాజా (D Raja) అన్నారు.
ఈ సమావేశానికి శివసేన (యూబీటీ) నేతలు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్రౌత్, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానాపటోలే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్, బాలాసాహెబ్ తోరట్ తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు. కర్ణాటకలో బీజేపీకి ప్రజలు గట్టి షాక్ ఇచ్చారని, మహారాష్ట్రలో కూడా ఆ పార్టీని అదే దెబ్బ కొట్టేలా ఎన్నికల వ్యూహాలు రచించాలని నిర్ణయం తీసుకొన్నారు. కూటమి ఐక్యత బలోపేతం, వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు ఈ భేటీలో చర్చించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Siddaramaiah | తదుపరి సీఎంపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య రహస్య సమావేశాలు..?
Terror funding case | ఉగ్రవాదులకు నిధుల కేసులో పుల్వామా, షోపియాన్ జిల్లా ఎన్ఐఏ సోదాలు