బెంగళూరు : కర్ణాటకలోని 16 జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల కాలంలో సుమారు 500 మంది విద్యార్థులు వైరస్ బారినపడడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. కేసుల ఉధృతి కొనసాగితే కిస్మస్తో పాటు నూతన సంవత్సరం వేడుకలకు ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. గత నెల ప్రారంభం నాటికి కొవిడ్ కేసులు తగ్గాయి. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అనేక జిల్లాల్లో ఒక్క కేసు సైతం నమోదు కాలేదు.
ఈ క్రమంలో ఆంక్షలు ఎత్తివేయాలని భావిస్తున్న తరుణంలోనే ఇటీవల కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు విధించారు. హవేరి, కొడగు, చిక్కబళ్లాపుర, మైసూరు, మాండ్య, దావణగెరె, ఉత్తర కన్నడ జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. మిగతా జిల్లాల్లో కొవిడ్ కేసులు తక్కువగా ఉన్నాయి. పరిస్థితి అదుపులో ఉన్న ప్రతి జిల్లాలోనూ నాలుగు రెట్లు కేసులు పెరుగుతున్నాయి.
నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3వ తేదీ మధ్య 2వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంలో 1,800 వరకు కేసులు రికార్డయ్యాయి. ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 15 రోజుల్లో 25శాతం కేసులు పెరిగాయి. శివమొగ్గ, కొప్పల్ జిల్లాల్లో కేసుల పెరుగుదల నాలుగు శాతం నమోదైంది. ఇదిలా ఉండగా.. రోజువారీ కార్యకలాపాలు, వేడుకలపై ఆంక్షలు విధించే అజెండా ఏదీ ప్రభుత్వం ముందు లేదని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. అయితే, రాష్ట్ర పరిస్థితిని విశ్లేషించి రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.