బెంగళూరు, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంత్రులు, అధికారుల కమీషన్ల వేధింపులను భరించలేక ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకొన్నా.. హుబ్లీకి చెందిన బసవరాజు అమర్గోల్ అనే మరో కాంట్రాక్టర్ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతికి దరఖాస్తు పెట్టుకొన్నా.. బీజేపీ పాలిత కర్ణాటకలో పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే కాంట్రాక్టర్ తనకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం బొమ్మైకి కూడా పంపారు.
నిరాహార దీక్ష చేపట్టినా..
బెంగళూరు ఉత్తర తాలూకా దాసనపుర ఫిర్ఖాలోని ఆలూరులో కాంట్రాక్టర్ మంజునాథ్ గ్రామ పంచాయతీ భవనాన్ని రెండేండ్ల కిందట నిర్మించాడు. అప్పటి పంచాయతీ అభివృద్ధి అధికారి భవన నిర్మాణానికి రూ.4లక్షలు మంజూరు చేశారు. మిగతా రూ.71 లక్షలు ఇప్పటివరకూ చెల్లించలేదు. దీంతో మంజునాథ్ ఇటీవల నిరసన దీక్ష చేపట్టి ఆత్మహత్యకు యత్నించాడు. అప్పటి పంచాయతీ కార్యనిర్వాహక అధికారి జోక్యంచేసుకుని నెల రోజుల్లోగా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇది జరిగి 4 మాసాలు గడిచినా మంజునాథ్కు డబ్బులు చేతికి అందలేదు. తాను కమీషన్లు చెల్లించలేదని బిల్లులు మంజూరు చేయడం లేదని మంజునాథ్ ఆరోపించారు.