Karnataka : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్ సహా మతపరమైన దండలు వంటి వాటిని విద్యాసంస్థల్లో అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిని నిషేధిస్తూ బీజేపీ ప్రభుత్వం 2022లో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలు వంటి విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్ అమలుపై నూతన విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
దీని ద్వారా విద్యాసంస్థల్లో ఇటు క్రమశిక్షణ, అటు రాజ్యాంగం కల్పించిన విద్యాహక్కును సమతుల్యం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫాం ధరించాల్సిందే. దీంతోపాటు పరిమితంగా మతపరమైన, సాంప్రదాయబద్ధమైన డ్రెస్సులు, మాలలు వంటి వాటిని ధరించేందుకు అనుమతింంచింది. దీని ప్రకారం.. విద్యార్థులు టర్బన్స్, తలపాగాలు, హిజాబ్, రుద్రాక్షలు, శివధార మాలలు వంటివి ధరించవచ్చు. అలాగే, యూనిఫాం కూడా ఉండాల్సిందే. అలాగే, వీటిని ధరించారనే కారణంతో విద్యాసంస్థల్లోకి, తరగతి గదిలోకి ఎవరికీ అనుమతి నిరాకరించకూడదు.
అలాగే, వీటిని యూనిఫాంలకు బదులుగా కూడా భావించకూడదు. అలాగే, ఇవేవీ క్రమశిక్షణ, గుర్తింపు, భద్రత విషయంలో రాజీపడేలా ఉండకూడదు. ఇదే సమయంలో విద్యార్థులు ఇలాంటి మతపరమైన వాటిని ధరించేలా బలవంతం చేయకూడదు. 1983, కర్ణాటక విద్యా చట్టం ప్రకారం.. విద్యాసంస్థల్లో క్రమశిక్షణ తగ్గకూడదు. ఇక.. 2022లో విద్యాసంస్థల్లో హిజాబ్ వంటి మతపరమైన వాటిని నిషేధిస్తూ అప్పటి బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో భారీ వివాదం చెలరేగింది.