బెంగళూరు: బెళగావి (Belagavi ) మహారాష్ట్రలో భాగమే అని కర్ణాటక మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం చెలరేగింది. బెళగావికి చెందిన కర్ణాటక స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ ఇటీవల కరడగ గ్రామంలో జరిగిన కన్నడ సాహితీవేత్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, బెళగావి మహారాష్ట్రలో భాగమేనని తెలిపారు. ‘స్వాతంత్ర్యానికి ముందు, కర్ణాటక, మహారాష్ట్రకు చాలా పోలికలున్నాయి. బెళగావి మహారాష్ట్రలో భాగం. ఎంతో సంతోషంగా మనం జీవిస్తున్నాం. కర్ణాటకలో జన్మించినందుకు ఇక్కడి ప్రజలు అదృష్టవంతులు’ అని అన్నారు.
కాగా, మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయ దూమారం లేపాయి. ప్రతిపక్ష బీజేపీ, జేడీ(ఎస్) నేతలు ఆమెపై మండిపడ్డారు. కర్ణాటక సార్వభౌమాధికారానికి, అంతరాష్ట్ర సరిహద్దులో భాషా సామరస్యానికి భంగం కలిగించేందుకు ఆమె ప్రయత్నించారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శించారు. ఆమెను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు మహారాష్ట్రపై ఉన్న వ్యామోహం నుంచి లక్ష్మీ హెబ్బాల్కర్ ఇంకా బయటకు రాలేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి అన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలా మాట్లాడకూడదని హితవు పలికారు. సీఎం సిద్ధరామయ్య ఆ మంత్రికి తగిన బుద్ధి చెప్పాలని కుమారస్వామి డిమాండ్ చేశారు.