న్యూఢిల్లీ : మైసూర్ శివార్లలో వైద్య విద్యార్ధినిపై ఆరుగురు వ్యక్తుల సామూహిక లైంగిక దాడి ఘటనకు సంబంధించి కర్నటక హోంమంత్రి అరగ జ్ణానేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లైంగిక దాడి ఘటన నేపథ్యంలో రాత్రి ఏడు గంటల సమయంలో అక్కడ ఆమె ఏం చేస్తోందని మంత్రి ప్రశ్నించారు.
విద్యార్ధిని ఆమె స్నేహితుడు అక్కడికి కాకుండా వేరే నిర్జన ప్రదేశానికి వెళ్లాల్సిందని వ్యాఖ్యానించారు. సామూహిక లైంగిక దాడి ఘటన అమానుషన చర్యని ఈ ఘటనను రాజకీయం చేసేందుకు కాంగ్రెస్ తమపై బురద చల్లుతోందని మంత్రి ఆరోపించారు. మైసూర్లో లైంగిక దాడి ఘటన జరిగితే కాంగ్రెస్ పార్టీ తనపై లైంగిక దాడికి ప్రయత్నిస్తోందని ఆయన దుయ్యబట్టారు. మంత్రి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత బ్రజేష్ కలప్ప ఆక్షేపించారు.
హోంమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని అన్నారు. లైంగిక దాడి ఘటన ఏదైనా సున్నితమైన అంశమని, దీన్ని రాజకీయం చేయరాదని బాధ్యతాయుతంగా మాట్లాడాలని బీజేపీ నేత ఎస్ ప్రకాష్ అన్నారు. లైంగిక దాడి ఘటనను కాంగ్రెస్ రాజకీయ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.