బెంగళూరు, మార్చి 14: హిజాబ్ కేసుపై కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నది. ఈ నేపథ్యంలో రాజధాని బెంగళూరులో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా వారం పాటు ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే ఉడిపితోపాటు పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ ఉడిపికి చెందిన పలువురు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూరాజ్ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే వాదనలు విన్నది. హిజాబ్ అంశంపై కర్ణాటకలో దుమారం రేగిన విషయం తెలిసిందే. హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.