హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక చతికిలపడుతున్నది. వెనుకటికి ఔరంగజేబు జుట్టుమీద పన్ను వేసినట్టు కొత్త కొత్త పన్నులువేసి ప్రజలనడ్డిని విరుస్తున్నది. అందులో భాగంగా తీసుకువచ్చిందే ‘గైడెన్ వ్యాల్యూ’ ట్యాక్స్. ఒక్కమాటలో చెప్పాలంటే.. భవిష్యత్తులో ఎప్పటికైనా మీ ఏరియా అభివృద్ధి చెందుతుంది కాబట్టి, అందుకు ఇప్పుడే పన్ను కట్టండి అంటూ వసూలు చేస్తున్నదే ఈ గైడెన్ వ్యాల్యూ ట్యాక్స్. బీజేపీ సర్కారు 40 శాతం కమీషన్రాజ్కు భయపడి.. ఏదో ఉద్ధరిస్తుందని కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చుకున్న కర్ణాటక ప్రజల పరిస్థితి చివరకు పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్టయ్యింది!
కర్ణాటకలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పన్నుల వాత మొదలుపెట్టింది. ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా బెంగళూరు పరిసర ప్రాంతాల్లోని కమర్షియల్ స్థలాలపై పన్నును 25-70 శాతం మేర పెంచింది. ‘గైడెన్స్ వ్యాల్యూ’ పేరుతో ఈ పెంపునకు సిద్ధమైంది. అక్టోబర్ 1 (ఆదివారం) నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో బెంగళూరులోని ఎలక్ట్రానిక్, స్మార్ట్ సిటీ ప్రాంతంలో 50 శాతం నుంచి 70 శాతం వరకు పన్ను భారం పెరిగినట్టు బిల్డర్లు చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ సిటీలో చదరపు అడుగుకు రూ. 500- 750 వరకు పన్ను పెంచినట్టు సమాచారం. బెంగళూరుకు దూరంగా, ఇంకా మౌలిక వసతులు కూడా ఏర్పాటుచేయని ఏడు జోన్లలోని జాగాలపై 50 శాతం మేర పన్ను పెంచడం విమర్శలకు తావిస్తున్నది. ఈ స్థలాల్లో మెట్రో, ఎకనమిక్ కారిడార్ ప్రతిపాదనలు ఉన్నాయని, దీంతో భవిష్యత్తులో భూముల ధరలు పెరిగే అవకాశం ఉండటంవల్లే పన్ను పెంపు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే, జరుగుతాయో, జరుగవో తెలియని అభివృద్ధి పనులను చూపించి ఇప్పుడే ఇబ్బడిముబ్బడిగా పన్నువాత వేయడమేంటని బిల్డర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై 43 బిల్డర్ అసోసియేషన్లు అభ్యంతరాలు లేవనెత్తాయి. గైడెన్స్ వ్యాల్యూ పేరుతో పెంచిన పన్నులను వెంటనే తగ్గించాలని విజ్ఞప్తి చేశాయి. అయినప్పటికీ, ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లడంపై పలువురు మండిపడుతున్నారు.
పెంపునకు కారణాలెన్నో..
గడిచిన ఐదేండ్లలో గైడెన్స్ వ్యాల్యూలో మార్పులు చేయలేదని, అందుకే ఇప్పుడు పన్నుపెంపు నిర్ణయం తీసుకొన్నట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, రాజకీయ ప్రయోజనాలే దీని వెనుక అసలు కారణమని అనుమానిస్తున్నారు. ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీ పథకాలను ఆర్భాటంగా ప్రకటించింది. గృహజ్యోతి పథకం పేరిట 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు, రూ.1,500 ఇచ్చే యువనిధి స్కీమ్, మహిళలకు నెలకు రూ.2 వేలు ఇచ్చే గృహలక్ష్మి స్కీమ్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ‘శక్తి పథకం’ను తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చి వందరోజులైనా ఈ స్కీమ్ల అమలు పూర్తిస్థాయిలో జరుగట్లేదు. ఈ పథకాలను అమలు చేయాలంటే ఏటా రూ. 65 వేల కోట్లను వెచ్చించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్తో పాటు మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ఆ ఎన్నికల ప్రచారానికి పెద్దమొత్తంలో నిధులు అవసరం. ఈ క్రమంలోనే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొన్న కర్ణాటక కాంగ్రెస్ సర్కారు పన్ను మోతకు సిద్ధమైందని విపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇది పొలిటికల్ ఎలక్షన్ ట్యాక్స్
కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో నిధుల సమీకరణకు బెంగళూరు బిల్డర్లపై పొలిటికల్ ఎలక్షన్ ట్యాక్స్ను ప్రతి చదరపు అడుగుకు రూ.500 చొప్పున పన్ను విధిస్తున్నది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. స్కాముల వారసత్వంతో సాంగ్రెస్గా మారిపోయింది. కర్ణాటక నిధులను తీసుకొచ్చి తెలంగాణలో ఎంత వెదజల్లినా ఇకడి ప్రజలను మోసం చేయలేరు. తెలంగాణ ప్రజలు సాంగ్రెస్ను తిరసరిస్తారు.
-మంత్రి కేటీఆర్