Karnataka | బెంగళూరు : హిజాబ్పై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. మైసూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధం ఉండదని తెలిపారు. గతంలో బీజేపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
మహిళలు తమకు నచ్చిన దుస్తులను ధరించొచ్చు. అది వారి హక్కు అని సీఎం పేర్కొన్నారు. ప్రధాని మోదీ పదేపదే వ్యాఖ్యానించే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఉట్టి బోగస్ మాటలు అని ధ్వజమెత్తారు. దుస్తులు, కులాల ఆధారంగా ఈ దేశ ప్రజలను, సమాజాన్ని బీజేపీ విభజిస్తోందని మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం బసవరాజు బొమ్మై హిజాబ్ ధరించడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. హిజాబ్ ధరించడం విషయంలో ఇస్లాం మతపరంగా తప్పనిసరిగా ధరించాలన్న నియమం ఏం లేదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. విద్యాసంస్థల్లో ఏక రూప దుస్తులు ధరించాలని కోర్టు పేర్కొంది.