బెంగళూరు: కర్ణాటకలో గత బీజేపీ సర్కార్పై వెల్లువెత్తిన ‘40 శాతం కమీషన్’ ఆరోపణలపై ప్రస్తుత సిద్ధరామయ్య ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీకి హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ నాగమోహన్ దాస్ నేతృత్వం వహిస్తారని పేర్కొన్నది. గత ప్రభుత్వ ప్రజాపనులకు సంబంధించి అన్ని శాఖల కార్యకలాపాలపై కమిషన్ విచారణ చేయనున్నది.
కాంట్రాక్టర్లు పనులను ప్రారంభించక ముందే ప్రజాప్రతినిధులకు 25-30 శాతం కమీషన్ ఇవ్వాల్సి వచ్చేదని, మిగతాది కాంట్రాక్టు పని పూర్తయిన తర్వాత చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నదని ఉత్తర్వు పేర్కొన్నది. నిబంధనలు, పని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పాలనాపరమైన అనుమతులు ఇచ్చారా? లేదా? అనే దానిపై కూడా జ్యుడీషియల్ ప్యానెల్ పరిశీలన చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ముందస్తుగా నిర్ణయించిన రేట్ల షెడ్యూల్కు అనుగుణంగా ప్రాజెక్టు అంచనా వ్యయాలు ఉన్నాయా? అంచనాలను సవరించాల్సిన అవసరం ఏర్పడిందా? అనే అంశంపై కూడా కమిషన్ దర్యాప్తు చేయనున్నదని పేర్కొన్నది. దర్యాప్తులో భాగంగా సంబంధిత అధికారులు జ్యుడీషియల్ కమిటీకి అడిగిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
‘40 శాతం కమీషన్’ సర్కార్గా ముద్ర
బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వంపై పెద్దయెత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. బీజేపీ ప్రభుత్వానికి ‘40 శాతం కమీషన్’ సర్కార్గా ముద్ర పడింది. పలువురు మంత్రులు, బీజేపీ నేతలు ‘40 శాతం’ లంచం డిమాండ్ చేస్తున్నారని పేర్కొంటూ.. కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాని మోదీ, అప్పటి సీఎం బొమ్మైకు లేఖలు రాసింది. పలువురు కాంట్రాక్టర్లు లంచం వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన సందర్బాలు ఉన్నాయి. మరికొందరు కారుణ్య మరణం ప్రసాదించాలని రాష్ట్రపతికి లేఖలు రాశారు.