బెంగళూరు: కర్ణాటక (Karnataka) ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)తో అన్ని లావాదేవీలను నిలిపివేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు బ్యాంకుల్లోని ఖాతాలను మూసివేయాలని, డిపాజిట్లను వెంటనే రికవరీ చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో నిర్వహించే ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర ప్రభుత్వ సంస్థలు రద్దు చేయాలి’ అని ఆ ఆర్డర్లో పేర్కొన్నారు. అలాగే ఇకపై ఈ బ్యాంకుల్లోని ప్రభుత్వ ఖాతాల్లో డిపాజిట్లు చేయవద్దని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య ఆమోదించిన ఈ ఉత్తర్వును ఆర్థిక కార్యదర్శి జారీ చేశారు.
కాగా, ఎస్బీఐ, పీఎన్బీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి ఈ రెండు బ్యాంకులకు కర్ణాటక ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి స్పందన రాకపోవడం, సమస్య అపరిష్కృతంగా ఉండడంతో ప్రభుత్వం ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకున్నది. ఎస్బీఐ, పీఎన్బీ ఖాతాల్లో అన్ని లావాదేవీలను నిలిపివేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.