బెంగళూరు, జూలై 22: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో కర్ణాటక మాజీ మంత్రి ఈశ్వరప్పకు పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. ఈ కేసులో మాజీ మంత్రిపై మోపిన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని పోలీస్ అధికారులు వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఈ ఏడాది ఏప్రిల్ 12న ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య వాట్సాప్ వీడియో సోషల్మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈశ్వరప్పతోపాటు ఆయన అనుచరులు ఇద్దరిపై కేసు నమోదైంది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో మంత్రిపై మోపిన అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేని కారణంగా ఆయనకు క్లీన్చిట్ ఇచ్చినట్టు తాజాగా తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలు చేసినట్టు పేర్కొన్నారు.