బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పకు కేబినెట్ హోదా తరహా సౌకర్యాలు కొనసాగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ మంత్రి మాదిరిగా జీతభత్యాలు, ప్రభుత్వ వాహనం, అధికార నివాసం వంటి సౌకర్యాలు మాజీ సీఎం యెడియూరప్పకు కొనసాగుతాయని కర్ణాటక ప్రభుత్వ సిబ్బంది, పరిపాలనా సంస్కరణల విభాగం (DPAR) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఆ పదవిలో ఉన్నంత వరకు యెడియూరప్పకు కేబినెట్ హోదా సౌకర్యాలు అందుతాయని పేర్కొంది.
అయితే, యెడియూరప్ప దీనిని తిరస్కరించారు. మాజీ సీఎంకు కల్పించే సౌకర్యాలు మాత్రమే తాను వినియోగించుకుంటానని చెప్పారు. ఆ ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కోరుతూ సీఎం బసవరాజ్ బొమ్మైకు ఆదివారం లేఖ రాశారు. బీజేపీ ఎమ్మెల్యేల అసంతృప్తి నేపథ్యంలో యెడియూరప్ప జూలై 26న సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం షికారిపుర ఎమ్మెల్యేగా తప్ప ఎలాంటి పదవుల్లో లేరు.